కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు శంకుస్థాపన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
జూబ్లీహీల్స్‌ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌ నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి గారు తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు వివరించిన మ్యాప్‌లలో ముఖ్యమంత్రి గారు పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు.


ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్‌, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్‌ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు.
అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్‌ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పోరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking