నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లు, పనితీరును అభినందించిన నోడల్ అధికారి ఐ ఏ ఎస్. యం.ప్రశాంతి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉమ్మడి జిల్లానోడల్ అధికారి ప్రశాంతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలసి మున్సిపాలిటీ లోని బాగులవాడా , దిలవార్ పూర్ లోని సిర్గాపూర్, రత్నా పూర్ కాండ్లి,మామడ మండలం బండల్ ఖానాపూర్ వార్డ్, గ్రామాలలో పర్యటించి దరఖాస్తుల స్వీకరణ, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం లో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం నోడల్ అధికారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో ఆరు గ్యారంటీలను అమలు పరచడానికి అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను సేకరించడం జరుగుతుందని ఈ నెల 28 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగిందని జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు .
పని దినాలలో ప్రణాళిక ప్రకారం గ్రామాలలో, వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించి ఆరు గ్యారంటీలకు సంబందించి ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించాలని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొనెలా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రతీ ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయంగా మీ ఊరికి వచ్చిందని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వివిధ కారణాల వల్ల గ్రామ సభలో దరఖాస్తు చేసుకొని వారు తిరిగి గ్రామ కార్యదర్శికి దరఖాస్తు సమర్పించుకోవచ్చని తెలిపారు.దరఖాస్తు దారులకు తప్పనిసరిగా రశీదు అందించాలని సంబంధిత అధికారులను సూచించారు.
గతంలో ఇక్కడ జిల్లా పాలనాధికారి గా విధులు నిర్వహించిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ పరిశుభ్రత, రహదారుల రూపురేఖలు మారాయని కొనియాడారు