భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. శాశ్వతంగా భూములు కోల్పోవాల్సి వస్తున్నందున వారికి పరిహారం గరిష్టస్థాయిలో ఉండే విధంగా చూడాలని అన్నారు.
జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న వివిధ సమస్యలపై దృష్టి సారించి తక్షణం వాటిని పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతీయ రహదారుల విషయంలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) అధికారులు ప్రస్తావించిన అంశాలపై తక్షణం స్పందించిన సీఎం గారు ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు నిర్మాణంలో ఉన్న పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలను ఆరా తీశారు.
ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలతో పాటు ప్రతిపాదనలను సమర్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తెలంగాణ రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మంచిర్యాల – వరంగల్‌ – ఖమ్మం – విజయవాడ కారిడార్‌ భూ సేకరణ పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు.
సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎన్‌హెచ్‌ఏ ప్రాజెక్ట్స్‌ మెంబర్‌ అనిల్‌ చౌదరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking