ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇచ్చింది లేదు
స్వంత నిధులతోనే రాష్ట్రాభివృద్ధి
బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్, ఏప్రిల్ 19: నిర్మల్ పురపాలక సంఘ సర్వసభ్య అత్యవసర సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. త్వరలోనే సీయం కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రానికి రానున్నారని, నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్దికి రూ.100 కోట్లు నిధులు కేటాయించాలని సీయంకు విన్నవిస్తామని తెలిపారు. ప్రతీ వార్డుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.
సీయం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాలను కూలగొడుతూ ముఖ్యమంత్రులను మారూస్తుందని మహారాష్ట్రలో జరుగుతున్నపరిణామాలను ప్రస్తావించారు.
ఇక తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ… తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని బీజేపీ కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర కక్ష్యసాధింపు ధోరణిని ప్రజలంతా గమనిస్తున్నారని వెల్లడించారు. పార్టీలు శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని వ్యాఖ్యనించారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చించోలి -బి సమీపంలోని వొకేషనల్ సెంటర్ ఏర్పాటుపై బీజేపీ నేతలు నానా రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. ఈద్గాతో పాటు అక్కడ వొకేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గతంలో ఆలయాల నిర్మాణలకు కూడా స్థలాన్ని కేటాయించామని ఈ సందర్భంగా తెలిపారు.