ఇందిరా మహిళా శక్తి” పై అవగాహన కార్యక్రమం

 

* స్వశక్తి రుణాలతో మహిళలకు ఆర్థిక తోడ్పాటు

* స్కూల్ యూనిఫామ్ తయారీలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో సిరిసిల్ల

* అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

 రాజన్న సిరిసిల్ల జిల్లా,
31 జులై 2024 ,
ప్రజాబలం ప్రతినిధి,
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలతో మహిళలు సొంతంగా ఆదాయ వనరులను సృష్టించి, ఆర్థికంగా ఎదగవచ్చని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ భవనంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆదాయ వనరులు కల్పన దిశగా ప్రభుత్వం రూపొందించిన పలు ప్రణాళికలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ముందుగా వివరించారు. ప్రతి యూనిట్ ఏర్పాటు తీసుకోవాల్సిన చర్యలు, దీని వల్ల కలిగే లాభాలను తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు అందజేసి ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో ఉన్న మహిళా సంఘాలకు రూ.500 కోట్ల రుణాలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలను చిన్నచిన్న వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు వినియోగించాలని తెలిపారు. మహిళలు తమకు అందే రుణాలను వినియోగించి ఆదాయ వనరులను సృష్టించుకోవాలని సూచించారు. పాడి పశువులు, కుట్టు మిషన్ కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, పౌల్ట్రీ, ఆహార శుద్ధి కేంద్రాలు కష్టం హైరింగ్ సెంటర్స్, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్, మిల్క్ పార్లర్స్, క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ ,ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మొదలగు రంగాలలో మహిళలు వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సలహాలు ఇతర సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం అందిస్తుందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా 1800 , ఈడి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరో 600 పాడి పశువుల యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కరీంనగర్ మిల్క్ డైరీ యూనిట్ తో వీరిని సమన్వయం చేస్తామని, ఆసక్తి, అర్హత కలిగిన మహిళా సంఘాల ద్వారా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

జిల్లాలో 5123 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 3392 వ్యాపార యూనిట్ల విస్తరణ, 1607 నూతన వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో ఉన్న వ్యాపార యూనిట్లు నడిపే మహిళా సంఘాలతో చర్చించి వారి అనుభవాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు . వ్యాపార అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సంఘాల ద్వారా మన జిల్లాలో 31 యూనిట్ లు ఏర్పాటు చేసి స్కూల్ ఏకరూప దుస్తులు కుట్టించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు తయారు చేసే అవకాశం కల్పించామని అన్నారు. అనంతరం కుట్టుకూలీ ధర పెంచడం పట్ల మహిళా సంఘాల సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఏకరూప దుస్తులు కుట్టడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ సత్కరించారు.

సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, కరీంనగర్ డైరీ డిఓ డాక్టర్ జయకర్, పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఈడిఎస్సి కార్పొరేషన్ స్వప్న, డిడిఎం నాబార్డ్ దిలీప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, జిఎం ఇండస్ట్రీస్ భారతి, పిడిఎఫ్ శ్రీనివాస్ సంబంధిత అధికారులు, తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking