యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నాం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే దాదాపు 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామని, ఆ తర్వాత డీఎస్సీ, గ్రూప్‌ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం గుర్తుచేశారు.
చట్టబద్దమైన జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ సివిల్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌మెన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి, గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపట్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.
ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు.
పజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వ్రేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌ రెడ్డి, శ్రీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే ప్ర్రకాశ్‌ గౌడ్‌, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking