అనంతపేట్ లో కేజీబీవీ బాలికల పాఠశాల భవనం ప్రారంభం
రూ 3.80 కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణం
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్, జూలై 18: రాష్ట్రంలో విద్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలో రూ.3.80 కోట్లతో నిర్మించిన కేజీబీవీ బాలికల పాఠశాల భవనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ విద్యారంగానికి ప్రాధాన్యమిస్తున్నారు. కేజీబీవీ ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థినులకు మెరుగైన విద్య అందుతుంది. పాఠశాలలో సకల సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకొని రూ.3.80 కోట్లతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది.
కేజీ టు పీజీ అమలులో భాగంగా ప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించి బాలికలకు మెరుగైన విద్యనందిస్తుంది. అనంతపేట్ లో ఏర్పాటు చేసిన కేజీబీవీ పేద విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుంది. సకల సౌకర్యాలతో భవన నిర్మాణం చేపడుతుండడంతో విద్యార్థినుల, ఉపాధ్యాయుల సమస్యలు తొలగిపోనున్నాయి.