పోలింగ్ ప్రక్రియ, ప్రత్యేక సదుపాయాలపై వయోవృద్దులకు అవగాహన
మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 22:
మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని ఎలక్షన్ కమీషనర్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు స్వీప్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా జిల్లా అదనపు కలెక్టరు అధ్యక్షతన సీనియర్ సిటిజెన్స్ కి అవగాహన సమావేశం నిర్వహించబడింది. వయోవృద్దులకు పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తూ, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వి.వి.ప్యాట్ ల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని హితవు పలికారు. జిల్లాలో ఎంతో చైతన్యం కలిగిఉన్న వయోవృద్ధులు ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేపడుతూ వివిధ రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని అదనపు కలెక్టర్ గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఎనభై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులు, దివ్యంగులు తమ ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించిందని వివరించారు. ఇంటి నుండి ఓటు వేయదల్చుకున్న వారు ఎన్నికల ప్రకటన వెలువడిన మీదట నిర్ణీత ఫారం నింపి తమ అభ్యర్థనను తెలియజేస్తే, పోలింగ్ అధికారి నేతృత్వంలోని సిబ్బంది వారి ఇంటి వద్దకు వచ్చి సీక్రెట్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సదుపాయాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వయోవృద్దుల కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్, వీల్ చెయిర్ వంటి సదుపాయాలూ అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేస్తూ, పూర్తి అవగాహన కల్పించేందుకు వీలుగా కలెక్టరేట్, ఇతర కార్యాలయాల్లో నమూనా కేంద్రాలను నెలకొల్పడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పలువురు సీనియర్ సిటిజన్ లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్స్ ను శాలువా తో సత్కరించారు,. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిని హరి ప్రియా స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస మూర్తి, తహసీల్దార్ శామీర్ పేట్, ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వర్ రెడ్డి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వయోవృద్దులు పాల్గొన్నారు.