ప్రపంచంలోనే టీజేఎఫ్ది ఒక చరిత్ర
టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం, భద్రాద్రి జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో
రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ
ఖమ్మం ప్రతినిధి జూన్ 18 (ప్రజాబలం) ఖమ్మం
దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం, అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఫండ్, జర్నలిస్టుల హెల్త్ కార్డుల సాధన కోసం జర్నలిస్టులు మరో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలని టి యు డబ్ల్యూ జే (టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం, భద్రాద్రి జిల్లాల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం ఖమ్మంలోని డి పి ఆర్ సి భవనంలో ఘనంగా జరిగింది. ఉమ్మడి ఖమ్మం, భద్రాది జిల్లాల నుండి వందలాదిగా తరలివచ్చిన జర్నలిస్టుల సమావేశానికి టి యు డబ్ల్యూ జే (టీజేఎఫ్) యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హజారి, టెంజు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, టి యు డబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కళ్యాణ్ చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్లం నారాయణ మాట్లాడుతూ… టీజేఎఫ్ ఒక చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ యూనియన్ అని అన్నారు. గతంలో ప్రపంచంలోనే మరే దేశంలోనూ ఇలాంటి చరిత్ర నిర్మించబడలేదని అన్నారు. ఇప్పటివరకు జర్నలిస్టుల స్వేచ్ఛ అణచివేత నిర్బంధం హక్కుల సాధన కోసం జరిగిన జర్నలిస్టు ఉద్యమాల్ని చూశామనీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే మరెక్కడ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రజల అస్తిత్వం కోసం పోరు సలిపిన ఘనమైన చరిత్ర టీజేఎఫ్ జర్నలిస్టుల దేనని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహోన్నతంగా సాగించిన ఉద్యమం టీజేఎఫ్ జర్నలిస్టులకే దక్కుతుందన్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో చలన శీలంగా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల మధ్య నిర్మించిన ఒక వీరోచిత పోరాట చరిత్ర టీజేఎప్ దేనని అన్నారు. మన జర్నలిస్టులు ఒక చరిత్ర నిర్మాతలని ఆయన అన్నారు. మన యూనియన్ వెనుక ఒక సుదీర్భమైన పోరాట చరిత్ర ఉందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. జర్నలిస్టుల ఉద్యమాల చరిత్రలో పదివేల మందితో ఒక మహాసభ నిర్వహించిన ఘనమైన చరిత్ర మనదేనన్నారు. సభలో పాల్గొన్న 10వేల మంది ప్రజలు కాదని కలం కార్మికులని అంతమంది జర్నలిస్టులతో పోరాడి నిర్మించిన యూనియన్ మనదేనన్నారు. ఢిల్లీ లో 2వేల మందితో ధర్నా నిర్వహించి సరికొత్త జర్నలిస్టు ఉద్యమాలకు ఊపిరి ఊదామని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. ఇంత పెద్ద విజయం సాధించిన యూనియన్ చరిత్ర వెనుక గ్రామీణ ప్రాంత విలేకరులదే ప్రధాన పాత్ర అని అన్నారు. ఒక వైపు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతూనే మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించామన్నారు. స్వార్థ ప్రయోజనం కోసం రాష్ట్ర సాధనలో తమ పదవులకు రాజీనామా చేయని నాయకుల ఇండ్ల ముందు ధర్నాలు నిర్వహించి వారిని పదవులకు రాజీనామా చేయించిన చరిత్ర కూడా మనదేనన్నారు. కడుపు కొట్టుకొని మన సమస్యలను వదిలి రాష్ట్ర సమస్యలపై పోరాడిన చరిత్ర ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు హెల్త్ కార్డులు జర్నలిస్ట్ సంక్షేమ నిధి అక్రిడేషన్లు ఈ నాలుగు అంశాలపై మరో చరిత్రకు, మరో పోరాటానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న సమయంలో 100 కోట్లతో జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకున్నామని రూ.15 కోట్లతో మీడియా అకాడమీ భవనం నిర్మించామని అన్నారు.
ఖమ్మం జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యపై మరో ఉద్యమం
ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా జీవో జారీ చేసి కేటాయించిన 26 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు పంచేంతవరకు ఉద్యమించాల్సిందనని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. రెండు రోజుల క్రితం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిసి వినతి పత్రం ఇచ్చి జర్నలిస్టుల పక్షాన కృషిచేసిన ఖమ్మం జిల్లా టీఏడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ప్రత్యేక చొరవను ఈ సందర్భంగా అల్లం నారాయణ కొనియాడారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రావు మాట్లాడుతూ… కేవలం సమావేశం ఉందని పిలుపునిచ్చిన 24 గంటల వ్యవధిలో ఇంతమంది జర్నలిస్టులను సమావేశపరిచిన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులను కొనియాడారు. జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మారుతి సాగర్ రావు అన్నారు. ఇండ్ల స్థలాల సాధనకు రాష్ట్ర కమిటీ నుండి వచ్చి ఖమ్మం జిల్లా జర్నలిస్టుల ఉద్యమంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ అర్బన్ ఈ మూడు ప్రాంతాలలో ఇండ్ల స్థలాల పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. జీవోలు ఇచ్చి స్థలాలు కేటాయించినా పంపిణీలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 16 వేల అక్రిడేషన్లు మాత్రమే ఉంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఏకంగా 23 వేల అక్రిడేషన్ కార్డులు సాధించుకున్నామని మారుతి సాగర్ రావు గుర్తు చేశారు. డెస్క్ జర్నలిస్టులకు తప్పకుండా అక్రిడిటేషన్లు ఉండాల్సిందేనన్నారు.
రాష్ట్ర నాయకులు రమణకుమార్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ జర్నలిస్టు సంక్షేమం కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. ప్రభుత్వాలు ఏమైనా మీడియా అకాడమీ మాత్రం స్వతంత్ర వ్యవస్థగా పనిచేయాలని రమణ కుమార్ సూచించారు.
యూనియన్ రాష్ట్ర కోశాధికారి యోగానంద్ మాట్లాడుతూ… జర్నలిస్టుల సంక్షేమంలో అల్లం నారాయణ సారథ్యంలో సాధించిన విజయాలు అనిర్వచనీయమన్నారు. కోవిడ్ కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకున్న చరిత్ర మనదేనన్నారు. ఇటీవల కాలంలో ఆరు నెలల వ్యవధిలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అందాల్సిన లక్ష రూపాయల సహాయం, కుటుంబ సభ్యులకి అందాల్సిన పింఛన్ గురించి ఖమ్మంలో జరపనున్న మహాసభల సందర్భంగా ఆ యూనియన్ నాయకులు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉందని ఐజేయూ నాయకులను ఉద్దేశించి యోగానంద్ అన్నారు.
యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ… ఖమ్మం నా సొంత జిల్లాగా భావిస్తాను అన్నారు. కొన్ని యూనియన్ల తప్పుడు వాగ్దానాలను జర్నలిస్టు మిత్రులు నమ్మవద్దన్నారు. ఇండ్ల స్థలాలు మినహా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి సారథ్యంలో అన్ని సాధించుకున్న ఘనత మన యూనియన్ కే దక్కిందన్నారు. టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో నాటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ వి పి గౌతమ్ నిర్లక్ష్యం కారణంగా జర్నలిస్టులకు అందాల్సిన ఇంటి స్థలాలు అందకుండా పోయాయి అన్నారు. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు 23 ఎకరాలను, కొత్తగూడెం జిల్లాలో 17 ఎకరాలు కేటాయిస్తూ ఖమ్మం ఉమ్మడి జిల్లా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని క్యాబినెట్ ఆమోదం తెలిపినా.. జర్నలిస్టులకు అందకపోవడం శోచనీయమన్నారు. ఖమ్మం నగరంలో గత జనవరి 18న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ముగ్గురు ముఖ్యమంత్రుల సాక్షిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హామీకి ఖమ్మం జిల్లా మంత్రి అజయ్ కుమార్, కలెక్టర్ వి పి గౌతం తూట్లు పొడిచారన్నారు. యూనియన్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం టియుడబ్ల్యూజేఎఫ్ ద్వారానే సాధ్యమన్నారు. జర్నలిస్టుల కష్టకాలంలో అండగా నిలిచింది టీజేఎఫ్ యూనియన్ మాత్రమే అన్నారు. ఖమ్మం జిల్లా కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. అనేక ఉద్యమాల ద్వారా జర్నలిస్టుల సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో టీజేఎఫ్ యూనియన్ ద్వారానే సాధ్యమైందన్నారు. ఖమ్మం జిల్లాలో యూనియన్ బలంగా పనిచేస్తుందన్నారు. కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
రామోజీరావు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లకు నివాళులు
ఖమ్మం డి పి ఆర్ సి భవనంలో మంగళవారం జరిగిన టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం భద్రాద్రి జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో తొలిత ఇటీవల చనిపోయిన ఈనాడు సంస్థల అధినేత జర్నలిస్ట్ రామోజీరావు, భద్రాద్రి జిల్లా ఇల్లందుకు చెందిన జర్నలిస్ట్ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మృతికి సమావేశం ఘనంగా నివాళులర్పించింది. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర బాధ్యులను ఖమ్మం భద్రాది జిల్లాల జర్నలిస్టు యూనియన్లు శాలువాలు పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, లింగయ్య, శెట్టి రజనీకాంత్, ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా యూనియన్ నాయకులు వనం నాగయ్య, అమ్మ న్యూస్ బ్యూరో మందుల ఉపేందర్, మహిళా జర్నలిస్టు భారతి, పిన్ని సత్యనారాయణ, ఆర్ టి వి ఉదయ్, బీఆర్కే న్యూస్ శ్రీధర్ శర్మ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దే రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు ఎలమందల జగదీష్, అశోక్, కెరటం న్యూస్ భద్రాద్రి జిల్లా బ్యూరో జల్ది శ్యామ్, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, వివిధ పత్రికల జిల్లా బ్యూరోలు, స్టాఫర్లు, మండల, నియోజకవర్గ స్థాయి విలేకరులు పాల్గొన్నారు