ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి
పంటలు సమృద్ధిగా పండి, రైతులు ఆనందంగా జీవించాలి
రంజాన్తో అద్భుత సందేశం
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పవిత్ర రంజాన్ ( ఈద్ – ఉల్ – ఫితర్ ) పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఉపవాస దీక్ష మనిషిలో త్యాగం, కరుణ, సానుభూతి, ప్రేమను పెంచి, సర్వ పాపాలు తొలగిపోయేలా చేస్తుందని నమ్ముతారని అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, పరోకారం, సోదరతత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్పూర్తితో ఈద్ -ఉల్ -ఫితర్ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపు కోవాలన్నారు.అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.మంచి వర్షాలు పడి, రైతులు సమృద్ధిగా పంటలు పండేలా వారిని ఆశీర్వదించాలని నామ ఆకాంక్షించారు. అల్లా అందరి జీవితాల్లో ఆనందాలు నింపి,వారి ఆశలు నెరవేర్చాలని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ఓ అద్బుత ప్రయాణమని, అందులో ఈద్ – ఉల్ – ఫితర్ ఓ అద్భుత ఘట్టమన్నారు. రంజాన్ అంటే క్షమాపణ కోరడానికి మరో అవకాశమన్నారు. అల్లా ఆశీస్సులు ,అనుగ్రహం ఎల్లవేళలా సదా అందరిపై ఉండి , ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి శాంతి,శ్రేయస్సును ప్రసాదించాలన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి అల్లా ఇవ్వాలని అన్నారు. ప్రేమ,దయ,సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసమని నామ అన్నారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు , నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్బరమైన జీవితాలను వెల్లబుచ్చుతున్న వారి కోసం మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత దానం చేయడం ద్వారా ముక్తి ,శుభ ఫలితాలు లభిస్తాయని పవిత్ర ఖురాన్ స్పష్టం చేస్తుందని అన్నారు. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకుని, చదవాలని, వినాలని నామ అన్నారు. అల్లాపై విశ్వాసం ఉంచి,స్వచ్చమైన మనసుతో ఉపవాసం చేయడం ద్వారా నిర్ధేశిత లక్ష్యం ఫలిస్తుందనే విశ్వాసం ఉందని అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో అల్లా దీవెనలతో ప్రతి ఒక్కరూ కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకుని, అన్ని విధాలా అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. వారికి అల్లా అన్ని విధాలా అండగా ఉండి, వారిని ముందుకు నడిపించాలన్నారు. పవిత్ర రంజాన్ పండుగ వెనుక అద్భుతమైన సందేశం దాగి ఉందని అన్నారు. ప్రపంచ మానవాళికి మంచి చేసే ఉద్ధేశం ఉందన్నారు. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుందన్నారు. ఖురాన్ పఠనంతో మనస్సు, శరీరం, ఆత్మ అన్నీ పరిశుద్ధమవు తాయని చెప్పారు. పవిత్ర గ్రంధమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవిం చిందన్నారు. అందుకే ఈ మాసమంటే ముస్లింలకు అత్యంత ప్రవిత్రమైనదిగా భావిస్తారని అన్నారు. దివ్య ఖురాన్ మానవుడు ఎలా బతకాలి? ఎలా బతకవద్దనే విషయాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. వరాల మాసంగా రంజాన్ను పేర్కొంటారని, జీవితాన్ని, జీవిత గమనాన్ని పవిత్రంగా మార్చి మనసుకు ప్రశాంతత ఇచ్చేదే రంజాన్ అని అన్నారు. మనసులోనే స్వర్గం అనుభూతిని కలిగించేది రంజాన్ నెల అని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.