జిల్లాలో పంట నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీటి సరఫరా చేపట్టాలి

 

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి మార్చి 16 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలో పంట నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీటి సరఫరా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో ఎన్ఎస్పి ద్వారా సాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నీటి విడుదలపై కార్యాచరణ సమర్పించాలన్నారు. బీబీసీ క్రింద ఎక్కువగా ఆరుతడి పంటలు ఉన్నట్లు, ఈ పంటలకు ఇప్పటికే నాలుగు నుండి ఐదు తడులకు నీరందించినట్లు ఆయన అన్నారు. బోనకల్ మండలం నారాయణపురం, ఆళ్లపాడు, గోవిందాపురం గ్రామాల్లో పంట పాక్షికంగా దెబ్బతిన్నట్లు, నష్ట నివారణకు నీటి విడుదల చేయాలన్నారు. చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సెక్టార్ల వారిగా ప్రణాళిక చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖచే గుర్తించిన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.సత్తుపల్లి, తల్లాడ, వైరా తదితర ప్రాంతాలకు నీరందించినట్లు, ఇప్పుడు సమస్యలు లేవన్నారు. పంట కోతకు వచ్చిన ప్రాంతాలు, ఎంతమేర విస్తీర్ణం పూర్తి వివరాలతో వ్యవసాయ శాఖ వారు నివేదిక ఇవ్వాలని, ఈ నివేదికను బట్టి నీటి సరఫరా ఆవశ్యకతను గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఏ ఏ చోట్ల పంటలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎక్కడ ఎప్పుడు నీటి అవసరం వుందనే దానిపై సైoటిఫిక్ గా ప్రణాళిక చేపట్టి, పటిష్ట కార్యాచరణ చేయాలన్నారు. రైతులు ఆందోళన చెందకుండా నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, నీటిపారుదల సిఇ శంకర్ నాయక్, ఎస్ఇ లు, ఆనంద్ కుమార్, నర్సింగ రావు, ఇఇ లు శ్రీనివాస చారి, ఎం. వెంకటేశ్వర్లు, అననీయ, రామకృష్ణ, వ్యవసాయ శాఖ ఎడి లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking