ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి ఖాళీలను,బ్యాక్ లాగ్ వేకెన్సీస్ 6, 7, 8, 9వ తరగతులలో మిగిలిపోయిన కొద్ది సంఖ్యలో గల ఖాళీలను నేడు ఉదయం 9 గంటల నుండి తెలంగాణ స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి కొప్పుల స్వరూపరాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదిలాబాద్ రీజియన్ లో ఉన్న 9 బాలికల పాఠశాలలు,ఏడు బాలుర పాఠశాలలో ఐదవ తరగతిలో బాలురకు 23 ఖాళీలు, బాలికలకు నాలుగు ఖాళీలు,ఆరవ తరగతిలో బాలురకు ఆరు ఖాళీలు, బాలికలకు ఆరు ఖాళీలు,ఏడవ తరగతిలో బాలురకు ఆరు ఖాళీలు,బాలికలకు ఆరు ఖాళీలు,8వ తరగతిలో బాలురకు మూడు ఖాళీలు, బాలికలకు ఐదు ఖాళీలు, తొమ్మిదవ తరగతిలో బాలురకు 21 ఖాళీలు, బాలికలకు 17 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.ఖాళీలను నింపడానికి ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత కల్పించబడును.ఎంపికైన విద్యార్థులు వివిధరకాల కారణాలవల్ల పాఠశాలలో జాయిన్ కాకుండా ఉన్నట్టయితే, అట్టి వారికే ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు సంబంధించిన హాల్ టికెట్ ను అడ్మిషన్ అలాట్ మెంట్ రిజల్ట్ షీట్ ను కౌన్సిలింగ్ కి వెంట తీసుకు రావాల్సిఉంటుందన్నారు.స్పాట్ అడ్మిషన్లు కేటాయించే సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శారీరక వికలాంగులకు,అనాధలకు విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే సమయంలో వీరు కూడా తమ అర్హతను తెలిపే సర్టిఫికెట్లను తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు పై అంశములన్నింటినీ జాగ్రత్తగా పరిగణించుకొని, అర్హతలు తెలియజేసే ఒరిజినల్,జిరాక్స్ పత్రాలతో రావాల్సి ఉంటుందన్నారు.