అర్ధ రాత్రి కొరుక్కుతినే చలిలో రైతన్న కష్టాలు

 

ప్రజబలం :హైదరాబాద్ ప్రతినిధి,
సబ్బుబిల్ల… అగ్గిపుల్ల కాదేదీ ధర పెరగడానికి అనర్హం అన్నట్లు ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగుతోంది. దీన్ని ఉత్పత్తి చేస్తున్న వారు ధరను పెంచేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాలు అడ్డు చెప్పడం లేదు. కంపెనీలకు నష్టమొస్తుందని ముందే ధర పెంచి అమ్మినా ప్రభుత్వాలు వారికి సహకారం అందించేస్తున్నాయి. సరే కంపెనీలో కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఇంత చేస్తున్నారని సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఇటీవల సినిమా వాళ్లు టికెట్ ధర పెంచుకునేందుకు, బెన్‌ఫిట్ షోలకు సైతం ప్రభుత్వం అనుమతించింది. అంటే సినిమా వాళ్లు నష్టపోవద్దని.. కానీ రైతు వద్దకు వచ్చేసరికి వారు ఎంతో కష్టపడి పండించే పంటకు మాత్రం సరైన ధర లభించేలా కృషి చేయడం లేదు. దీనికి కారణమేంటి..? రైతుల కష్టానికి విలువ లేదా.. విలువ దొరకదా?

పదేండ్ల క్రితం వరకు ఎడ్ల బండ్లతో దుక్కి దున్ని చదును చేసి పంటలు పండించేవారు. ఇప్పుడు యాంత్రీకరణతో పరిస్థితులు మారిపోయాయి. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగాయి. దీంతో వ్యవసాయానికి పెట్టుబడి భారంగా మారింది. ఇది చాలదన్నట్లు మొన్నటి వరకు కూలీలు పొలాల్లో పనిచేస్తూ కనిపించేవారు. ఇప్పుడు పొలాల్లో కూలిపనికి వచ్చేవారు తగ్గిపోయారు. అయినా రైతులు మొక్కవోని ధైర్యంతో దేశానికి అన్నం పెట్టడానికి పొలాన్ని నమ్ముకుంటున్నాడు. విత్తనం నాటిన నుండి చేతికొచ్చే వరకు చేసే కష్టానికి రైతే బాధ్యుడవుతున్నాడు. కానీ తాను పండించే పంటకు మాత్రం ధర నిర్ణయించుకునే దిక్కులేని పరిస్థితి. సామాజికవేత సిరిసిల్ల నవీన్ కుమార్ తన ఆవేదన వ్యక్తం చేసారు.

ధర నిర్ణయించుకునే అధికారం కావాలి!
రాష్ట్రంలో సాగువుతున్న పత్తి పంటకు ఎకరానికి అవుతున్న ఖర్చెంత.. లభిస్తున్న ధర.. ఎంత.. రైతుకు దక్కుతున్నదో తెలిస్తే.. అసలు వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి దయనీయం. దీనికి కారణం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఒకటైతే.. వ్యాపారులు రైతులను వడ్డీ రూపంలో నడ్డి విరిచేయడం మరో కారణం. రైతులు ఎకరా పంట పండించడానికి 65వేల నుండి 75వేల వరకు ఖర్చుపెడుతున్నారు. మరి ఎకరానికి వచ్చే దిగుబడి ఎంత..? పంటపండిన రైతుకి ప్రతి ఏడాది ఇంకా అప్పు పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర అంటూ ఆర్భాటం చేస్తున్నా.. అది కూడా రైతుకు దక్కడం లేదు. ఈ సమయంలో కార్పొరేట్ వ్యాపారులు ఎలా అయితే తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించి అమ్ముకోగలుగుతున్నారో అలాగే ప్రభుత్వం రైతుల పంటకు కూడా ధర నిర్ణయించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. రైతు వద్దకే వచ్చి పంట కొనుగోలు చేసే రోజులు రావాలి. బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితి పెంచగలగాలి. ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ అంటూ ఆర్భాటపు ప్రచారాలు కాకుండా రైతులకు ఏది అవసరమో.. పంట అమ్ముకునేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే వారికి లాభసాటిగా ఉంటుందో చూడాలి. రైతుకు సాయం కాదు.. పెట్టుబడి ఖర్చులు పోగా తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కాస్త మిగిలేలా చూడాలి. అప్పుడే రైతు నిలదొక్కుకోగలడు. కూరగాయల రైతన్నాల ఆవేదన.

Leave A Reply

Your email address will not be published.

Breaking