దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా సభ హాస్పిటల్‌ సేవల విస్తరణపై పరిశీలించి అమలుకు ప్రయత్నిస్తాం : రేవంత్‌రెడ్డి

ముషీరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:రాష్ట్రంలో పౌరులు అందరికీ హెల్త్‌ ప్రొఫైల్స్‌ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. డిజిటల్‌ హెల్త్‌ కార్డుల రూపకల్పనలో ఆరోగ్య రంగంలో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని అభిలషించారు.
ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్‌ సెంటర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.
రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని, ప్రాఫిట్‌ మేకింగ్‌ బిజినెస్‌ ఓరియెంటెడ్‌ ప్రభుత్వం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు.
హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల ప్రక్రియలో సహకారానికి సంబంధించి సామాజిక బాధ్యత కలిగిన దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ లాంటి సంస్థలతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం మంత్రి గారికి సూచించారు.
క్యాన్సర్‌ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్‌ చికిత్స పేదలకు భారమవుతోందని, రాష్ట్రంలో క్యాన్సర్‌ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా సభ, హాస్పిటల్‌ సేవల విస్తరణపై యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అమలుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking