పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆయుధాలు, యుద్ధ వాహనాల ప్రదర్శన

 

సికింద్రాబాద్‌,జనవరి 13:యుద్ద ట్యాంకర్లు.. శత్రు సేనలపై విరుచుకుపడే ఆయుధాలు.. యుద్ద భూమిలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పసిగట్టే రాడార్లు.. సైనికులు గాయపడితే వారికి అక్కడికక్కడే చికిత్స అందించేందుకు ఉపయోగించే మొబైల్‌ ఆసుపత్రులు..! భారత సైన్యం పరాక్రమాన్ని ధీరత్వాన్ని కళ్లకు కట్టేలా సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆయుధాలు, యుద్ధ వాహనాల ప్రదర్శన ప్రారంభమైంది.1949లో జనవరి 15న కరియప్ప అనే భారతీయుడు తొలిసారిగా దేశ సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఏటా జనవరి 15న ఆర్మీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో రణక్షేత్రంలో సైనికులు వాడే ఆయుధాలు, యుద్ద ట్యాంకర్లు, వాతావరణ పరిస్థితులను తెలియజేసే పరికరాలు, అత్యాధునిక కమ్యునికేషన్‌ వ్యవస్థ వంటివి ప్రదర్శిస్తున్నారు.
సైనికులు యుద్ధం సమయంలో ఉపయోగించే 30 ఎంఎం ఆటోమేటిక్‌ గ్రనేడ్‌ సిస్టం, 84-ఎంఎం రాకెట్‌ లాంచర్‌, బైనాక్యూలర్‌, 40-ఎంఎం బ్యారెట్‌ గ్రనేడ్‌ లాంచర్‌, 7.62 ఎంఎం ఎన్​ఈజీవీ, 5.56 ఎంఎం ఇన్సాస్‌ లైట్‌ మిషిన్‌ గన్‌, అసాల్ట్‌ రైఫిల్‌, ఇన్సాస్‌ రైఫిల్‌ వంటి 14 రకాల ఆయుధాలు ప్రదర్శనలో కొలువుదీరాయి. రెండు రోజులపాటు పరేడ్‌ మైదానంలో ఈ ప్రదర్శన కొనసాగనుంది. ప్రజలు అందరూ ప్రదర్శనను తిలకించవచ్చని సైనిక అధికారులు తెలిపారు.విద్యార్ధులు, యువత సైన్యంలో చేరేందుకు వారిలో స్ఫూర్తి నింపడమే ఉద్దేశంగా ఈ తరహా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఆయుధాలను ఏ విధంగా వినియోగిస్తారు, యుద్ద ట్యాంకులను ఎలా ఉపయోగిస్తారు, సైనికులు యుద్ధంలో గాయపడితే వారికి ఏ విధంగా చికిత్స అందిస్తారు. అనే అంశాలపై ప్రదర్శన చూసేందుకు వస్తున్న వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌లో భాగంగా ఆర్మీ బ్యాండ్‌ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking