మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ఎమ్మెల్యే దానం నాగేందర్
జీహెచ్ఎంసీ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, జనవరి 04: నగర ప్రజలకు అన్ని సౌకర్యాలతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ధి పనులు చేపట్టబడుతున్నామని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
శనివారం నాడు 3 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ పనులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడంలో నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు మేయర్ తెలియజేశారు. అందులో భాగంగా తాజ్ కృష్ణ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రూ. 11.5 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను, జివికె మాల్ ఎదురుగా రూ. 12.75 లక్షల తో పూర్తి చేసిన జంక్షన్ అభివృద్ధి పనులను మేయర్ ప్రారంభించారు. రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టిన జవహర్ నగర్ పార్క్లో ఓపెన్ ఎయిర్ మినీ థియేటర్ ను ప్రారంభోత్సవం చేశారు. కె బి ఆర్ పార్క్ దగ్గర జంక్షన్ అభివృద్ధిలో భాగంగా రూ.1.96 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన సుందరీకరణ పనులను ప్రారంభించారు.
నంది నగర్ రోడ్ నెం. 14 లో మల్టిపుల్ ప్రాంతాలను కలుపుతూ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నంది నగర్ వరకు) రూ. 145.80 లక్షల వ్యయంతో చేపడుతున్నసీసీ రోడ్డు నిర్మాణ పనులకు,బంజారాహిల్స్ రోడ్ నెం.14లో రూ.148 లక్షల వ్యయంతో మసీదు నుంచి బ్రహ్మకుమారీస్ వరకు వివిధ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని మేయర్ పేర్కొన్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన రవాణా అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత నివ్వడం జరిగిందని హెచ్ సిటి ద్వారా నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అండర్ పాస్ లు ఫ్లై ఓవర్ లు నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో నియోజక అభివృద్ధి నిధుల క్రింద 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఇట్టి నిధులతో ప్రజలకు మౌఖిక వసతులు సి సి రోడ్లు, పైపు నీటి సరఫరా పనులు ఇతరత్రా అవసరమైన పనులను చేపట్టేందుకు ప్రణాళిక ను సిద్దం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఎస్.ఇ రత్నాకర్, కార్పొరేటర్ మన్నె కవిత, ఈఈ లు తదితరులు పాల్గొన్నారు.