21 రోజులలో కుటుంబంలో ముగ్గురు మృతి.
కుటుంబాన్ని ఆదుకోవాలని కేటీఆర్ కు విజ్ఞప్తి.
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, ఎల్లారెడ్డిపేట,( ప్రజాబలం ), రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో గడ్డి ఎల్లవ్వ (80) గురువారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది.మలీ దశ తెలంగాణ ఉద్యమకారుడు గడ్డి నరసయ్య (55) ఏప్రిల్ మూడవ తేదీన అనారోగ్యంతో మరణించగా, నరసయ్య చిన్న కుమారుడు నరేందర్ (23) మాయా లేడి ప్రేమలో పడి 45 రోజులు జైలు జీవితాన్ని అనుభవించి తన తండ్రి మరణానికి కారణమైన మాయలేడి ఇంటి వద్ద పెట్రోల్ పోసుకొని మంగళవారం 22-04-2025 తేదీన హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. కుమారుడు గడ్డి నరసయ్య, మరియు మనవడు గడ్డి నరేందర్ మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయిన గడ్డి ఎల్లవ్వ గురువారం24 వ తేదీ సాయంకాలం తుది శ్వాస విడిచింది. ఒకే కుటుంబంలో 21 రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించగా ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఈ వరుస సంఘటనలతో గ్రామస్తులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డి నరసయ్య తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశాడు. ప్రస్తుతం కుటుంబంలో ముగ్గురు మరణించడంతో వారి దినకర్మలు చేయడానికి కూడా డబ్బులు లేక కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆ కుటుంబాన్ని ప్రత్యక్షంగా వచ్చి పరామర్శించి, పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని, భరోసా కల్పించాలని బొప్పాపూర్ గ్రామస్తులు ఆశిస్తున్నారు.