వచ్చే 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలి

వరద సహాయక చర్యలకు జిల్లాకు రూ. కోటి మంజూరు
ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులు
సెలవుల్లో ఉన్న అధికారుల, సిబ్బంది వెనక్కు
భారీ వర్షాలు, సహాయక చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలతో
రెవెన్యూ, విపత్తుల నిర్వహణాశాఖ మంత్రిపొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌ :- రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్‌ కమీషనర్లు మరింత అప్రమత్తంగా ఉండి ఏవిధమైన ప్రాణ నష్టం, ఆస్ధి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ. గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గడచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్‌ సెక్రెటరీ రామకృష్ణ రావుతో కలసి గురువారం నాడు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గడచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్ధితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్‌ అలెర్ట్‌గా ఉన్నమెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో తీసుకోవలసిన సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయిలు విడుదల చేశామని అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు.


సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ లో మున్సిపల్‌, మెట్రో వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
రైల్వే లైన్లు, లోలెవెల్‌ బ్రిడ్జీలు, కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా లోలెవెల్‌ బ్రిడ్జీల దగ్గర పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
చిన్న చిన్న వర్షాలు 200 మిల్లీమీటర్లకే బ్యాక్‌ వాటర్‌ వల్ల అక్కడున్న ప్రజలను తరలించవలసి వస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం కోసం అక్కడున్నవారిని తరలించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.
ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking