అత్యుత్తమ స్పోర్ట్స్‌ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు.

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్‌ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్‌ లో క్రీడల ప్రోత్సాహానికి రూ.321 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. చదువులోనే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందనే నమ్మకం యువతలో కలిగిస్తామన్నారు.
తెలంగాణ క్రీడారత్నాలైన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ , క్రికెటర్‌ మొహ్మద్‌ సిరాజ్‌ కి గ్రూప్‌ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.
నెట్‌ జీరో సిటీలో స్కిల్‌ యూనివర్సిటీ, హెల్త్‌ హబ్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌ తోపాటు స్పోర్ట్స్‌ హబ్‌ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్‌ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా క్రీడలు ఉపకరిస్తాయని ఈ సందర్భంగా సీఎం అన్నారు.
శాసనసభ్యులు కూడా తమ క్రీడాస్ఫూర్తిని కూడా చాటుకునేలా ఇకపై ప్రతి బడ్జెట్‌ సెషన్‌ లో కార్యక్రమాలు నిర్వహించే సంప్రదాయాన్ని పునరుద్ధరించే అంశంపై అఖిలపక్షంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking