భూపాలపల్లి ప్రజాబలం ప్రతినిధి:బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనం, వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీ రూములు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముకాముఖి అయ్యారు. డైనింగ్ హాల్ లో నిరుపయోగంగా ఉన్న
ఆర్ఓ ప్లాంటును వెంటనే మరమ్మత్తులు చేపించి వినియోగంలోకి తేవాలని ప్రదానోపాధ్యాయుడిని ఆదేశించారు. విద్యార్థుల స్నానాలకు వేడినీటి కోసం సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డైనింగ్ హాలు పరిశీలించారు.
8వ తరగతి విద్యార్థులకు డిజిటల్ బోధన ద్వారా జరుగుతున్న హిందీ పాఠాన్ని పరిశీలించారు. అర్థం అవుతుందా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లు పరిశీలించి, విద్యార్థులు కంప్యూటర్ లో ఏవేమి నేర్చుకున్నారని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితమే కంప్యూటర్ ఉపాద్యాయులు విధుల్లో చేరారని చెప్పగా మంచి పరిజ్ఞానం సాధించాలని కంప్యూటర్ విద్యార్థుల భవిష్యత్తు కు అత్యంత ముఖ్యమని సూచించారు. అనంతరం 10 పదవ తరగతి విద్యార్థులకు బోధిస్తున్న ఫిజిక్స్ పాఠాన్ని విద్యార్థులతో చదివించి అభినందించారు. గ్రంధాలయానికి తాళం వేసి ఉండటం గమనించిన జిల్లా కలెక్టర్ ఓపెన్ చేయాలని, ప్రతి రోజు విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు చదువులో బాగా రాణించాలని మంచి మార్కులు సాధించి ఉన్నతస్థాయికి వెళ్ళాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పరిశుభ్రత పాటించాలనీ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వార్డెన్ ను ఆదేశించారు. ఎంతమంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారని హెచ్ ఎం ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 190 మంది విద్యార్థులు, 13 మంది సిబ్బంది ఉన్నారని హెచ్ ఎం తెలిపారు.
ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు రాజరత్నం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.