పూర్తి అవగాహనతో ఎన్నికల విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం ఎన్నికల విధులు కీలకమయినవని, ఏ దశలోనూ పొరపాట్లు జరగకుండా, పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులు, సెక్టార్ అధికారులకు పీవో, ఏపీవోల విధులపై చేపట్టిన శిక్షణ, అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీవో, ఏపీవోలు పోలింగ్, పోలింగ్ యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. పోలింగ్ యంత్రాల సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. మాక్ పోలింగ్, పోలింగ్ సందర్భంలో సాంకేతిక సమస్యలు ఎదురయినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ అధికారులు-1, 2, 3 లు ఎన్నికల సందర్భంలో ఏ ఏ విధులు నిర్వర్తించాలో మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలన్నారు. మాక్ పోల్ పూర్తయ్యాక తప్పనిసరిగా క్లియర్ చేయాలన్నారు. బూత్ ఆక్రమణ, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించాలి, క్యూ నిర్వహణ ఎలా చేయాలి, ఓటర్ల గుర్తింపు ఏ విధంగా చేపట్టాలి, ఓటింగ్ తర్వాత క్లోజ్ బటన్, ఓటింగ్ యంత్రాల సీలింగ్, ఎన్నికల పత్రాల సీలింగ్, చట్టబద్ధమైన ఫారాలు పూరింపులపై అవగాహన కల్గివుండాలని కలెక్టర్ అన్నారు. ఎన్నికల సంఘం చే జారీచేసిన పీవో హ్యాండ్ బుక్, పూర్తిగా చదివి, ఏ సమయంలో ఏం చేయాలి తూ.చ. తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మాస్టర్ ట్రేయినర్లు శ్రీరామ్, మదన్ గోపాల్ లు పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా పోలింగ్ అధికారుల విధులు, భాధ్యతలపై పూర్తి అవగాహన కల్పించారు. ఓటింగ్ యంత్రాలపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, సిపిఓ ఏ. శ్రీనివాస్, నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.
.

Leave A Reply

Your email address will not be published.

Breaking