మహిళా సభ్యుల ఆత్మీయ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 28/05/23 ఆదివారం
జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి హాజరయిన మహిళా సభ్యులు, మరణించిన సభ్యుల కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ సభ్యుల ఇళ్ళ స్థలాల పంపిణీ పై
సుప్రీం కోర్టు తీర్పును వెంటనే అమలుపరచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. సొసైటీ లో సభ్యులుగా ఉన్న తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు తమ కష్టాలను విన్నవిస్తు కన్నీరు మున్నీరయ్యారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. మరణించిన సభ్యుల అంత్య క్రియలకు కుడా డబ్బు లేని దుర్భర స్థితిని ఎదుర్కొన్నామని, దివంగత జర్నలిస్ట్ శ్రీనివాస్ భార్య జయశ్రీ ఆవేదన వెలిబుచ్చారు. తన కార్టూన్ల తో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా.. ఆయన మరణానంతరం తమ కుటుంబం అనేక ఇబ్బందుల్లో పడిందని కార్టూనిస్ట్ శేఖర్ భార్య చంద్రకళ అన్నారు. ఇప్పటికయినా ముఖ్యమంత్రి తమ బాధను అర్థం చేసుకొని తమకు భూమిని అప్పగించాలని కోరారు. మీటింగ్ కు హాజరయిన మహిళా సభ్యులంతా తమ భూ సమస్యను పరిష్కరించాలని ముక్త కంఠంతో కోరారు.
సొసైటీ సెక్రటరీ వంశీ శ్రీనివాస్ హాజరై సభ్యుల సందేహాలకు సమాధానాలిచ్చారు. సమావేశానికి సుమారు 50 మంది మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు.