జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ ను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం
న్యూఢిల్లీ జూన్ 8 ();విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో అమలులో ఉన్న బీసీ రిజర్వేషన్ల శాతం, జాబితాల పునర్విభజన, మార్పులు, చేర్పులను శాస్త్రీయంగా నిర్ణయించడానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘ కులగణన’ చేపట్టాలని కోరుతూ జాతీయ బీసీ కమిషన్ సిఫారసు చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు కోరారు.గురువారంనాడు న్యూఢిల్లీలో బికాజీ కామ ప్లేస్, త్రికూట్-1 లో గల జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ తో డా|| వకుళాభరణం ప్రత్యేకంగా భేటి అయ్యారు. పలు అంశాల వారిగా కూలంకశంగా చర్చించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందచేశారు. తొలిసారిగా కలిసిన ఈ నేపథ్యంలో ఇరువురు ఛైర్మన్లు ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. పుష్పగుచ్ఛాలు అందచేసుకున్నారు. శాలువాలతో సత్కరించుకున్నారు.