వేములవాడ ప్రజాబలం ప్రతినిధి: మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దంపతులు, తదితరులు ఉన్నారు.