ఖమ్మం జనవరి 5 ప్రతినిధి (ప్రజాబలం) ఖమ్మం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం, మన వాతా వరణానికి అనుకూలంగా మొక్కలను మలచడం స్ఫూర్థినిచ్చే అంశమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మంత్రి, రఘునాథపాలెం మండలం శివాయి గూడెంలో రైతు బానోతు భీమ్లా నాయక్ డ్రాగన్ ఫ్రూట్స్ తోటను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వియత్నాం, థాయిలాండ్, అమెరికా దేశాలలో పండే డ్రాగన్ ఫ్రూట్ ను తెలంగాణ లో వివిధ రకాల వెరైటీలలో పండించడం అభినందనీయమని అన్నారు. బ్లడ్ షుగర్ తగ్గించడం, మలబద్దకం సమస్యను నివారించడం, ఎముకలను గట్టిపరచడం, గుండె సంబంధ వ్యాధులను రాకుండా చూడడం ఈ పండు చేస్తోందన్నారు. ఒకసారి నాటితే డ్రాగన్ ఫ్రూట్ 20 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుందన్నారు. మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకం ఎంతో లాభదాయకమని, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు సహకార సంఘం అధ్యక్షులు తాతా రఘురామ్, సాదు రమేష్ రెడ్డి, మలీదు జగన్, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు ఉన్నారు