ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలి:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 9:
మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు చెందిన మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఓపీవోలు తమ విధులు ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.
ఈనెల 13న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయంలతో కలిసి మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓపీవోలతో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, ఏఆర్వో నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికలల్లో విధులు నిర్వహించే అధికారులు ప్రతి ఎన్నికను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, అందుకు గాను ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా చదవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులపై ఎక్కువగా బాధ్యత ఉన్నప్పటికీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కూడా అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఏదైనా కారణాలతో ప్రిసైడింగ్ అధికారి ఎన్నికలు నిర్వహించలేనట్లయితే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి కూడా ఎన్నికలు నిర్వహించే విధంగా సంసిద్ధంగా ఉండాలని నర్సింహారెడ్డి సూచించారు. ప్రతి ఎన్నికల మాదిరిగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా నిర్వహించాలని అందుకుగాను ముందుగా ఎన్నికల సందర్భంగా అధికారులు చేయాల్సినవి చేయకూడని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగిందని అదనపు కలెక్టర్, ఏఆర్వో నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో 14 పోలింగ్ స్టేషన్లకుగాను 8 పోలింగ్ కేంద్రాలు కీసర డివిజన్ లో, మరో 6 పోలింగ్ కేంద్రాలు మల్కాజిగిరి డివిజన్ లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,536 మంది ఓటర్లు ఉన్నారని అందులో పురుషులు 3,038, మహిళా ఓటర్లు 3,498 మంది ఉన్నారని వివరించారు. ఓటింగ్, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇంకా ఏమైనా అంశాలు తెలియకపోయినా సందిగ్ధం ఉన్నా ముందుగానే వాటిని తెలుసుకోవాలని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సరి చూసుకొని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి శిక్షణ కార్యక్రమంలో సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, ఎన్నికల మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలు తదితరులు పాల్గొన్నారు.