అత్యవసర సమయంలోనైనా డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 20 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ శనివారం రోజు ఒక ప్రకటనను విడుదల చేశారు. పెద్దపల్లి,మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ తెలిపారు. ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నందున రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని డ్యామ్స్ మరియు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది అని సాధారణ పరిస్థితి వచ్చే వరకు అక్కడికి ఎవరు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు.చెట్ల కింద,పాడైన భవనాలు కింద,శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు. విద్యుత్ స్థంభాలు,ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు. ఎవ్వరు కూడా ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువులోకి,నాలాలు, డ్యామ్స్,వాటర్ ఫాల్స్ లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. అత్యవ సరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి.స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా,రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర,ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు,వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.వరద నీటికి చెరువులు,కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది.కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి,గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.వర్షాలకు కల్వర్టు,చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరుప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.