కృష్ణా నదీ జలాల నీటి కేటాయింపుల పై బలమైన వాదనలు వినిపించాలి

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యునల్‌-II (కేడబ్ల్యూడీటీ-II ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్‌ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలన్నారు.
రాష్ట్ర నీటి పారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఢల్లీిలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు..
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం (ఏపీఆర్‌ఏ)-2014లోని సెక్షన్‌ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేపట్టాలి. ఏపీఆర్‌ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ సైతం సెక్షన్‌ 3 ఆధారంగా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించింది.
కేడబ్ల్యూడీటీ-IIతదుపరి విధివిధానాల (ఫర్‌దర్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వదు.
ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి-బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ , ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు (జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ) తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలి.
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా, ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలి.


పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్‌ ఐఐటీతో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలి.
సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలి.
ఈ సమీక్షలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు , పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు(నీటి పారుదల) ఆదిత్యనాథ్‌ దాస్‌ , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking