◆ 800 మంది వరద బాధితులకు నిత్యావసర సరుకులు
◆ ట్రాఫిక్ ఏసిపి సాదుల సారంగపాణి
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు04 (ప్రజాబలం) ఖమ్మం రెక్కాడితే డొక్కాడని కార్మికులు చేస్తున్న సేవలు విశేషమైనవని ఖమ్మం ట్రాఫిక్ ఏసిపి సాదుల సారంగపాణి అన్నారు. శుక్రవారం ఖమ్మంలో వరద బారినపడిన సుమారు 800 కుటుంబాలకు ఖమ్మం వెహికల్ మోటార్ కార్మికుల ఆధ్వర్యంలో సుమారు ఐదు లక్షల పైగా విలువచేసే నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఉదయం కరుణగిరి వద్ద ప్రారంభమైన ఈ పంపిణీ కార్యక్రమం కాల్వడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితులకు మీ కండగా మేమున్నామని ముందుకు వచ్చిన వారి సేవలు అమోఘం అన్నారు. ఈ కార్మికుల సేవలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని ఆయన కోరారు. నిత్యం మోటారు మెకానికులకు అనేక విధమైన సమస్యలు ఏర్పడుతుంటాయని, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు కార్మికులకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ సిఐ అశోక్ మాట్లాడుతూ.. మీకు వచ్చే అతితక్కువ సంపాదనలో కొంతమేరకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండటం మీ గొప్ప మనసుకి సూచికమన్నారు. మీ కార్మికుల త్యాగాలను గుర్తించి ఆర్థికంగా ఉన్న మరికొందరు ముందుకు వచ్చి ఇటువంటి సహాయ సహకారాలను అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మోటార్ కార్మికుల నాయకులు పాషా, కిషోర్, అలీమ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు