సదర్మాట్‌ బ్యారేజీ ద్వారా వేల ఎకరాలకు సాగునీరురాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి

నిర్మల్‌ ప్రజాబలం ప్రతినిధి: జనవరి 16, 2026 – నిర్మల్‌ జిల్లా నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గ్రామ సమీపంలో నిర్మించిన సదర్మాట్‌ బ్యారేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సదర్మాట్‌ బ్యారేజీ ద్వారా వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. 2016 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 676.592 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించగా, ఇందుకోసం 1,176 ఎకరాల భూమిని సేకరించారని పేర్కొన్నారు.

ఈ బ్యారేజీ ద్వారా నిర్మల్‌ జిల్లా కడెం, ఖానాపూర్‌ మండలాల్లో 12 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ ప్రాంతాల్లో 5 వేల ఎకరాలు కలిపి మొత్తం 18,016 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో కడెం, ఖానాపూర్‌, కోరుట్ల మండలాల్లోని 34 గ్రామాల వ్యవసాయ భూములకు సాగునీరు అందనుందని వివరించారు. పాత సదర్మాట్‌ అనికట్‌, గంగానాలా ఆయకట్టు స్థిరీకరణకు 1.58 టీఎంసీల నిల్వ సామర్థంతో నీటిని సాగు అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో పాటు, పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్‌పీ జానకి షర్మిల, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking