ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ను సందర్శించిన రేవంత్‌ రెడ్డి ,శ్రీధర్‌ బాబు

తెలంగాణ రైజింగ్‌ ప్రధాన ఎజెండాగా సింగపూర్‌ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ను సందర్శించారు.
సింగపూర్‌ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు.
తెలంగాణలో స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, సెంట్రల్‌ కాలేజీతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది.


క్యాంపస్‌ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో సింగపూర్‌ ఐటీఈ అధికారులు, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ వైఎస్‌ చాన్సలర్‌ వీఎల్‌ వీఎస్‌ఎస్‌ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్‌ అకడమిక్‌, అడ్మిన్‌ సర్వీసెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పర్విందర్‌ సింగ్‌ , ఐటీఈ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఫాబియన్‌ చియాంగ్‌ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్‌ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking