సంక్షేమ సంస్కరణల ఆధ్యుడు “పి.వి.” 102వ జయంతి సందర్భంగా జ్ఞాన భూమిలో నివాళులు అర్పించిన డాక్టర్ వకుళాభరణం
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత స్వర్గీయ ప్రధాని పి.వి. నరసింహరావుకే దక్కుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. బలహీన వర్గాలకు ఆర్థిక చేయూత, కార్పోరేట్ విద్యను ఆశ్రమ, నవోదయ పాఠశాలల ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెచ్చారని అన్నారు. సంక్షేమ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు పేద వర్గాలలో జీవన భరోసాను నింపాయి అని, పి.వి. ఆర్థిక సంస్కరణల ఆధ్యుడిగా చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్నాడని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నారు. శ్రీ పి.వి. నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని జ్ఞాన భూమి వద్ద ఆయన పుష్పగుచ్ఛం సమర్పించి అంజలి ఘటించారు. అక్కడ జరిగిన సర్వమత ప్రార్ధనలలో పాల్గొన్నారు.
