రాష్ట్రవ్యాప్తంగా… కదంతొక్కిన కలం కార్మికులు

-కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు
-కలెక్టర్లకు వినతి పత్రాలు
-హైదరాబాద్‌ లో సమాచార భవన్‌ ఎదుట నిరసన
-కమీషనర్‌ కు వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర నాయకులు
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: ఫిబ్రవరి 24: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. సోమవారం అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు.

 


తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆయా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఫెడరేషన్‌ నాయకులు ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రవ్యాపిత ఆందోళనలో భాగంగా హైదరాబాద్‌ లోని మాసబ్‌ ట్యాంక్‌ లో గల రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ కార్యాలయం(సమాచార భవన్‌)వద్ద జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేసిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తుందని ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు తీర్పు సాకుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం,కొత్త అక్రెడిటేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు ఇంత వరకు ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం దుర్మార్గమని అన్నారు. జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వ మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా చిన్న చూపు చూడకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, కొత్త అక్రెడిటేషన్‌ కార్డులు, చిన్న, మధ్య తరహా పత్రికలకు ఎంపానెల్మెంట్‌ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

 

ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని, హెల్త్‌ కార్డులు లేక, వైద్య సదుపాయాలు అందక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు వందల మంది జర్నలిస్టులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఆరోగ్య భీమా పథకం, పెన్షన్‌ స్కీం అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమాచార పౌరసంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జగన్‌ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ ఎస్‌. హరీష్‌ ను కలిసి వినతి పత్రం సమర్పించి సమస్యలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్‌, గుడిగ రఘు, కార్యదర్శులు ఎస్‌ కే సలీమా, కార్యవర్గ సభ్యులు కె. పాండురంగారావు, పి.నాగవాణి, మణిమాల,నాయకులు యర్రమిల్లి రామారావు, శ్రీనివాస్‌ గౌడ్‌,రవికుమార్‌, సీహెచ్‌ రంగయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking