చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 25 (ప్రజాబలం) ఖమ్మం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మంత్రి చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియా అందించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. సంఘటన జరిగిన సమయంలో అందరిని సమన్వయం చేసుకొని, మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు, మరుసటి రోజు మంత్రి కేటీఆర్ గాయపడిన వారిని హైదరాబాద్ నిమ్స్ లో పరామర్శించి, ప్రకటించిన ఎక్స్ గ్రేషియా త్వరగా అందించాలని తెలిపినట్లు ఆయన అన్నారు. చనిపోయిన కుటుంబాల వారికి చీమలపాడు నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని, గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని అన్నారు. అంగవైకల్యం పొందిన వారికి ఆరోగ్యవంతులైన తర్వాత కృత్రిమ కాళ్ళు అందిస్తామని, వారి జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేకూరుస్తామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాల పిల్లలకు వారు అడిగిన చోట రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరుస్తామని , అన్ని వేళల సమిష్టిగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, సంఘటన కళ్లారా చూసి చాలా బాధపడినట్లు తెలిపారు. తన జీవితంలో ఇంతగా బాధపడలేదని, తట్టుకోలేక పోయినట్లు ఆయన అన్నారు. అధికార యంత్రాంగం అంతా కదిలిందని, అందుబాటులో ఉన్న వాహనాల్లో బాధితులను తరలించి ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా చూసినట్లు, మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ కు పంపినట్లు ఆయన తెలిపారు. ఒక కుటుంబంలో సంఘటన జరిగితే ఎలా స్పందిస్తారో, అందరూ అలా స్పందించినట్లు ఎంపీ అన్నారు. ప్రభుత్వం నుండి ఇంకా ఏం చేయాలో అంతా అందిస్తామని, పిల్లల విద్య, పథకాల లబ్ది చేకూర్చుతామని ఆయన తెలిపారు. నామా ముత్తయ్య ట్రస్ట్ నుండి సహాయం చేసినట్లు ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఇదివరకు ఏ సంఘటనలో జరగని సహకారం ఇప్పుడు అందిస్తున్నామన్నారు. అధికార కోణం కాకుండా, మానవతాదృక్పధంతో అందరూ సహకరించారన్నారు. భవిష్యత్తులో ఏమేం హామీలు ఇచ్చామో అన్ని నెరవేరుస్తామన్నారు. కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రమాదంలో 4 గురు మృతిచెందినట్లు, 5 గురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఎక్కడ ప్రమాదం జరిగిన వారిపై ఆధారపడ్డ కుటుంబాలకు రూ. 4 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా వస్తుందని, మంత్రి ప్రత్యేక చొరవతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు మంజూరు అయినట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ, సంఘటన చాలా బాధాకరమని, సత్వర ఆదేశాలు జారిచేసి, అతిత్వరలో ఎక్స్ గ్రేషియా అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ ఎన్. వెంకటేశ్వర రావు, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, సింగరేణి మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిపి మాలోతు శకుంతల, చీమలపాడు గ్రామ సర్పంచ్ కిషోర్, అధికారులు, బాధిత కుటుంబాల సభ్యులు తదితరులు వున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking