*రూ. 50 వేల చెక్కు అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి -19 (ప్రజాబలం ప్రతినిధి)
అగ్ని ప్రమాదంలో ఇల్లు, సామాగ్రి కాలిపోయిన బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా కు చెందిన ఏ. కైక కు సంబంధించిన పూరి గుడిసె మంగళవారం రాత్రి విద్యుత్ ప్రమాదంలో కాలిపోయింది. దీంతో ఇంట్లోని వంట సామగ్రి, బియ్యం కూలర్ ఇతర సామాగ్రి కాలి, పాడైపోయాయి. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలిసి విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధిత కుటుంబానికి రూ. 50 వేల చెక్కు ను అందజేశారు. తమను ఆదుకున్న కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.