మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రిటైనింగ్ వాల్ నిర్మాణం సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలి
రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు
పర్యాటక అభివృద్ధి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలి
ఖమ్మం ఖిల్లా రోప్ వే రోడ్డు సాధ్యమైనంత విస్తరించాలి
జూన్ 2026 వరకు ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టు పూర్తి
ధాన్యం కొనుగోలు, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగు మట్ల అర్బన్ పార్క్, పర్యాటక అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి తుమ్మల
ఖమ్మం ప్రజాబలం ప్రతినిధి:ఖమ్మం, మే -3:ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శనివారం మంత్రి, ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి ధాన్యం కొనుగోలు, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, జాతీయ రహదారుల పురోగతి, వెలుగు మట్ల అర్బన్ పార్క్, పర్యాటక అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం వచ్చిన భారీ వరదల నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల ప్రకారం చేసిన డిజైన్ మార్పుల మేరకు మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖమ్మం నగర వాసులు మరోసారి ఇబ్బందులకు గురి కావద్దని ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు మంజూరు చేశామని, పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని మంత్రి తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలని, రెండు వైపుల నుంచి ప్రణాళికాబద్ధంగా పని జరగాలని అన్నారు.
3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద ఉధృతి తట్టుకునేలా 8.5 కిలోమీటర్లకు పైగా రిటైనింగ్ వాల్ రెండు వైపులా పూర్తి చేయాలని, ఇప్పటి నుండి సంవత్సర కాలంలోగా పనులు పూర్తి కావాలని అన్నారు.
Prev Post