ఖమ్మం ప్రతినిధి జనవరి 24 (ప్రజాబలం) ఖమ్మం నెలాఖరులోగా సిఎంఆర్ రైస్ అందజేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, నేలకొండపల్లి మండలం రాయగూడెం, ముదిగొండ మండలం అమ్మపేట, కొనిజర్ల లో పర్యటించి రైస్ మిల్లులు తనిఖీ చేశారు. పర్యటనలో మంగళగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్, రాయగూడెంలోని లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్, అమ్మపేటలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్, కొనిజర్ల లోని మారుతి రైస్ మిల్లులని అదనపు కలెక్టర్ తనిఖీ. రైస్ మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ రైస్, ఇప్పటికి ఎంత అందించింది, మిగులు అందించడానికి చేపట్టిన కార్యాచరణను రైస్ మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. సిఎంఆర్ రైస్ అందించడానికి జనవరి 31 చివరి తేదీ అని, గడువు పొడిగింపు ఉండదని ఆయన తెలిపారు. గడువు లోగా సిఎంఆర్ రైస్ అందించడానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. కేటాయించిన లక్ష్యం మేరకు అందించని మిల్లులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.
అనంతరం అదనపు కలెక్టర్ చింతకాని మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని రేషన్ షాపు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, రికార్డు ప్రకారం నిల్వలు ఉన్నది పరిశీలించారు. ఇకెవైసి అప్డేట్ ఎంతవరకు చేపట్టింది అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు.