ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 15 (ప్రజాబలం) ఖమ్మం ఈ నెల 18 గురువారం నుండి నామినేషన్లను స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటుచేసి, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నట్లు, ఈ నెల 21 న ఆదివారం మినహాయించి, మిగతా 7 రోజులు ఉదయం 11.00 గంటల నుండి మ. 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ వేయడానికి వచ్చు అభ్యర్థికి సంబంధించి 3 వాహనాలు మాత్రమే అనుమతించబడునని, మిగతా వాహనాలు 100 మీటర్ల దూరంలో ఉండాలని ఆయన అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ అధికారి చాంబర్ లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒక ప్రపోజర్, గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులకు 10 మంది ప్రపోజర్లు ఉండాలన్నారు. పోటీచేయు అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండవచ్చని, ప్రపోజర్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగి ఉండాలని ఆయన అన్నారు. బ్యాలెట్ పేపర్ లో ముద్రణకు చిహ్నాలు ఎన్నికల సంఘం నుండి వస్తాయని, ఫోటోల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 26న అదే ఛాంబర్ లో స్క్రూటిని ప్రక్రియ చేపట్టబడుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 29 వరకు ఉపసంహరణ కు గడువు వున్నట్లు ఆయన అన్నారు. అభ్యర్థులకు కలెక్టరేట్ లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసి, లేటెస్ట్ నామినేషన్ పత్రం ప్రింట్, అఫిడవిట్ పత్రాలను అందుబాటులో ఉంచినట్లు, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. నామినేషన్ ఫారం-2ఏ లో, అఫిడవిట్ ఫారం-26లో సమర్పించాలన్నారు. అఫిడవిట్ లో అన్ని కాలమ్ లు పూర్తి చేయాలన్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు విషయమై తాజా బ్యాంక్ ఖాతాలు తెరవాలని, ఎన్నికల సంబంధ లావాదేవీలన్ని ఈ ఖాతా ద్వారానే జరపాలని ఆయన అన్నారు. అభ్యర్థి కి రూ. 25 వేలు సెక్యూరిటీ డిపాజిట్, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు అయితే, రూ. 12 వేల 5 వందలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అన్ని రకాల అనుమతుల కొరకు సువిధ సింగిల్ విండో ద్వారా దరఖాస్తులు చేయాలని, దరఖాస్తు 48 గంటల ముందస్తుగా చేయాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలన్నారు. నామినేషన్ స్వీకరణ చెక్ లిస్ట్ అందజేసి, దాని ప్రకారం సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, జెడ్పి సిఇఓ వినోద్, డిటిఓ సత్యనారాయణ, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు, బిఎస్పీ పార్టీ ప్రతినిధి బి. బాలరాజు, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్, సిపిఐ (ఎం) పార్టీ ప్రతినిధి వై. విక్రం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎన్. సత్యంబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి చీకటి రాంబాబు, టిడిపి పార్టీ ప్రతినిధి పాలడుగు కృష్ణ ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.