మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
SVEEP: Systematic voter’s Education and Electoral participation
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
శాసనసభ ఎన్నికల దృష్ట్యా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమాలపై పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఓటు హక్కు గురించి తెలియజేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా థర్డ్ జెండర్స్తో కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీ, కూకట్పల్లి నియోజకవర్గాల్లోని ఆల్వీన్ కాలనీలో వారికి కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, ఓటు వేయడం దాని ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గంలోని జవహార్నగర్, కాప్రా సర్కిల్ పరిధిలో దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగం, వారికి పోలింగ్ కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి అవగాహన కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే జిల్లాలోని ఆయా మెడికల్, ఇంజినీరింగ్, డిగ్రీ, తదితర 55 కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్ధులకు ఓటుపై అవగాహన కల్పించి వారిని ఓటరుగా నమోదు చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా 31,367 మంది విద్యార్థులచే ఓటరు ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. మేడ్చల్ – మల్కాజిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ఇప్పటి వరకు 286 కాలనీలు, బస్తీలు, ప్రజలు సమూహం ఉన్న ప్రదేశాలలో ఈవీఎమ్, వీవీప్యాట్లతో కూడిన రెండు ఎల్ఈడీ వాహనాలతో ప్రజలకు ఓటు వేయడం… తదితర విషయాలపై అవగాహన కల్పించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వీవోలు, సీఎల్ఎఫ్లు, ఎస్ఎల్ఎఫ్లు, ఏఎల్ఎఫ్ సంఘాలచే 554 సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త ఓటర్ల నమోదు, సవరణలతో పాటు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయడంపై మహిళలకు అవగాహన చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు కొత్త ఓటరు నమోదుకై విద్యార్ధులచే 98 అవగాహన ర్యాలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో స్వీప్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, ఇప్పటికే ఉన్న ఎపిక్ కార్డు నవీకరణ, దిద్దుబాటు, ఓటు ప్రాముఖ్యతపై ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అధారిటీ వారికి అవగాహన కల్పించామని పేర్కొన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో స్వీప్ లో భాగంగా 17 మార్నింగ్ వాకర్స్ పార్కులలో ఓటు వేయడం ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లాలోని మేడ్చల్, కుత్భుల్లాపూర్ నియోజకవర్గాలలో ఉన్న 1,36,255 మంది ట్యాక్స్ పేయర్స్కు ఓటరు నమోదు, సవరణలపై ఎస్ఎమ్ఎస్ల ద్వారా సందేశాలు పంపించడం జరిగిందని… అలాగే మల్కాజిరి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలలో ఉన్న ట్యాక్స్ పేయర్స్కు జీహెచ్ఎంసీ ద్వారా సందేశాలు పంపించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో నివాస సంక్షేమ సంఘాలకు, కాలనీలలో, బస్టాండ్లు, మాల్స్, థియేటర్, జనసమూహం ఉన్న ప్రదేశాలలో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.