ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం రబీ పంట సాగు మెలకువలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించి, మెరుగైన ఫలితాలు సాధించేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో రబి 2023-24 పంట పెట్టుబడి ఆర్ధిక సహాయం, రైతుభీమా, మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్ష ఫలితాల కార్డుల అందజేత, పంటల నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా స్థాయి మొదలు, డివిజన్, మండల, క్లస్టర్ స్థాయిలో అధికారులు పూర్తి సమన్వయంతో రైతులకు పంట సాగు విధానంపై ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల కనుగుణంగా విధి విధానాలు తెలియజేయాలన్నారు. పామాయిల్ సాగు లాభసాటిదని, పామాయిల్ సాగు విస్తరణ లక్ష్యాల కనుగుణంగా రైతులకు అవగాహన కల్పించి, ఎక్కువ విస్తీర్ణంలో పామాయిల్ సాగుకు ప్రోత్సహించాలన్నారు. రైతు వేదికల్లో నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పంటసాగు మెలకువలు, క్రమపద్ధతిలో క్రిమిసంహారక ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించి, ప్రతి క్లస్టర్ పరిధిలోని విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందించి తమ క్లస్టర్ పరిధిలో రైతులను చైతన్యవంతులను చేయాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల, వ్యవసాయ సాంకేతిక విభాగం సహాయ సంచాలకులు సరిత, శ్రీనివాస్రెడ్డి, ఉద్యానవన శాఖ ఏడి అనిత, ఏడిఏలు, ఏఓలు, ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు.