జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 : మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో బడ్జెట్, నిధుల వినియోగం తదితరాల సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యంతో కలిసి మున్సిపల్ కమీషనర్లు, ఈ.ఈ.లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆర్థిక సంవత్సరం ముగింపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో కేటాయించిన అభివృద్ధి పనుల నిర్వహణ కొరకు మంజూరైన నిధులు,ఖర్చుల వివరాలు,గుత్తేదారులకు కేటాయించిన పనుల వివరాలు,ఖర్చులు, జి.ఎస్.టి.ఇతర పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని తెలిపారు. శాఖల వారిగా అభివృద్ధి, సంక్షేమ పనులకు కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేసి పనులు పూర్తి చేసినట్లయితే నిర్ధారణ చేసి 5 రోజులలోగా ధృవపత్రం సమర్పించాలని,డి.ఎం.ఎఫ్.టి.నిధుల నుండి పనుల సంబంధించి పనుల కొరకు నిబంధనల ప్రకారం అడ్వాన్స్ లు విడుదల చేసుకోవాలని,లేకపోతే నిధులు తిరిగి అందించాలని తెలిపారు.జిల్లాలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, సంబంధిత బిల్లులు సమర్పించాలని,మార్చి-2025 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా నిధుల విడుదల, పనుల పురోగతి,ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.