ముఖ్యమంత్రి విజన్ అద్భుతమన్న యాంగ్ లియూ
ఢల్లీిలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్కాన్ చైర్మన్
ఢల్లీిలోని అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్కాన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని, అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్చైర్మన్ యాంగ్ లియూ కి వివరించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్ వారు పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్నిఅందిస్తామని యాంగ్ లియూ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ అద్భుతంగా ఉందని యాంగ్ లియూ కొనియాడారు.

సాధ్యమైనంత తొందర్లోనే హైదరాబాద్ ను సందర్శిస్తానని ఫాక్స్కాన్ చైర్మన్ ముఖ్యమంత్రి తో చెప్పారు. అంతకంటే ముందుగా ఫాక్స్కాన్ క్యాంపస్ ఆపరేషన్స్ చీఫ్ క్యాథీ యాంగ్ , ఫాక్స్కాన్ భారత దేశ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని యాంగ్ లియూ తెలిపారు.
సమావేశంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి బృందం విజయవంతంగా చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన, రాబట్టిన పెట్టుబడులు, తెలంగాణపై అంతర్జాతీయంగా నెలకొన్న ఆసక్తుల వివరాలను కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు యాంగ్ లియూ కి వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీలో ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ వెంట ఆ సంస్థ ఎస్బీజీ ప్రెసిడెంట్ బాబ్ చెన్ , సీబీజీ జీఎం జొ వూ , చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్ , సీఎస్బీజీ డిప్యూటీ జీఎం సూ, షో కూ , సీ-గ్రూప్ మేనేజర్ సైమన్ సంగ్ , సంస్థ భారత దేశ ప్రతినిధి వీ లీ తదితరులు ఉన్నారు. సమావేశంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు, పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డైరెక్టర్ ఎస్కే శర్మ తదితరులు పాల్గొన్నారు.