కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాంకేతిక విభాగం ( డిజిటైజేషన్) ను రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ శనివారం జిల్లా జడ్జి బి ప్రతిమతో కలిసి ప్రారంభించారు. ఈ ఆన్లైన్ కంప్యూటర్ విధానం ద్వారా అన్ని కోర్టులలో ఉన్న కేసుల రికార్డులను వీటిలో పొందుపర్చనున్నారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ నమోదు సంస్థ ప్రాజెక్టు మేనేజర్ హైకోర్టు జడ్జికి వీటి పనితీరు గూర్చి వివరించారు. అనంతరం న్యాయమూర్తులతో నిర్వహించిన జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ కు హాజరైన హైకోర్టు జడ్జి సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వెళ్లారు. కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ కార్యవర్గం ,అదనపు జిల్లా న్యాయమూర్తులు, సబ్ జడ్జి, మేజిస్ట్రేట్స్ , జిల్లా కోర్టు పాలనాధికారి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.