హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏ.ఐ.ఎం.ఐ.ఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాతంగా ముగిసిందని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఉదయం 10 గంటల లోపు ముగిసింది. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ఎన్నికల నియమావళికి అనుగుణంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో 88 ఓట్లు పోల్ కాగా అందులో 63 ఓట్లు ఏ.ఐ.ఎం.ఐ.ఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఫెండీ, 25 ఓట్లు బిజెపిఅభ్యర్థి డా.ఎన్.గౌత్ రావుకు పోలయ్యాయని తెలిపారు . గెలుపొందిన అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి డిక్లరేషన్ సర్టిఫికెట్ ను అందజేశారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణలో ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఎన్నికల విభాగపు అధికారులు, సిబ్బంది, ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి, పోలిస్ యంత్రాంగం, మీడియా ప్రతినిధులకు రిటర్నింగ్ అధికారి కృతజ్ఞతలు తెలిపారు.