ప్రజావాణిలో తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 

ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా అధికారులు,

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 27:ప్రజావాణిలో ప్రజలు తెలిపిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అన్నారు. సోమవారం శామీర్పేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో పాటు లా ఆఫీసర్ చంద్రావతి, సీపీవో మోహన్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులు, ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజలకు సంబంధించి సమస్యలు తీర్చేందుకు నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు సంబంధించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే ప్రజల ఇబ్బందులు తీర్చినవారమవుతామని అన్నారు. ఈ విషయంలో ఆయా శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన 83 దరఖాస్తులను స్వీకరించి ఆయా శాఖల అధికారులకు పరిష్కరించాల్సిందిగా అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking