రాజన్న సిరిసిల్ల జిల్లా,
7 జనవరి 2025,
ప్రజా బలం ప్రతినిధి.
జిల్లాలో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన
“సంచుల కుమారస్వామి” తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన “సంచుల కుమారస్వామి” గ్రామ సర్వే నెంబర్ 464లో గల 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదురు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు.2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ది పొందినందుకు ఆ సొమ్ము రికవరి కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 250 ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కోసమెరుపు… చిన్నచిన్న నాయకుల వద్ద ఇన్ని ఎకరాలు కబ్జా గురైతే మరి పెద్ద నాయకుల వద్ద ఇంకా ఎన్ని ఎకరాలు వేచి చూడాలి మరి