ప్రజావాణి ఫిర్యాదుల స్థితిగతులు ఆన్లైన్లో నమోదు చేయాలి
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి,లా ఆఫీసర్ చంద్రావతి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిబ్రవరి 10: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను లా ఆఫీసర్ చంద్రావతి తో కలిసి మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ( 57 ) ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టరు సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.