జగిత్యాల, సెప్టెంబర్ 14: ఎస్సి వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం వరకు నాలుగవ రోజుకు చేరాయి. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలకు పలు సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ అంశం న్యాయమైనదేనన్నారు. ఈ వర్గీకరణతో ఎవరికి నష్టం జరుగదన్నారు. ఎస్సి వర్గీకరణకు అందరూ అనుకూలమేనని అయినా బిజెపి పార్టీ వర్గీకరణపై చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదించాలని గంగారాం కోరారు. కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండడం సిగ్గుచేటన్నారు. ఈ ధీక్షలో జిల్లా కో కన్వీనర్ బెజ్జంకి సతీష్, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్, నియోజకవర్గ ఇంఛార్జి బొనగిరి కిషన్, మెట్ పెల్లి డివిజన్ ఇంఛార్జి మోతే సుధాకర్, ధర్మపురి నియోజకవర్గ ఇంఛార్జి దికొండ మహేందర్, బుగ్గారం మండల ఇంఛార్జి చిర్ర లక్ష్మణ్, సీనియర్ నాయకులు బోనగిరి లక్ష్మణ్, చొప్పదండి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.