నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేత శ్రీహరి రావు.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో చేపట్టిన రెండవ ఏఎన్ఎంల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ నాయకులు కూచాడి శ్రీహరి రావు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 21 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను నేటికీ పర్మినెంట్ చేయకపోవడం విచారకరమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఏఎన్ఎంల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే వారికి వచ్చే జీతం ఏమాత్రం సరిపోవట్లేదని అన్నారు. 2018 నోటిఫికేషన్ 30 శాతం వెయిటేజీ ఇచ్చిన ప్రభుత్వం 2023 నోటిఫికేషన్లు 20 శాతం ఇచ్చి ఏఎన్ఎంలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. వయసు, అనుభవం పెరుగుతుంటే వెయిటేజ్ పెరగాలి తప్ప తగ్గడం ఏంటని అన్నారు. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామనీ చెప్పడం న్యాయం కాదని తక్షణమే ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.