అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 17 (ప్రజాబలం) కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిద ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి పిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై క్లుప్తంగా తెలుగులో ఒక పేజికి మించకుండా తయారు చేసిన ప్రగతి నివేదికలను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి అందచేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులకు సూచించారు. సమస్య పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో అందచేసిన పిర్యాదులు కొన్ని:-
సుజాతనగర్ మండలం, గరీబీపేట గ్రామానికి చెందిన తమ్మ రాజమ్మ భర్త (లేటు) నర్సయ్య సర్వే నెం. 15-అలో 23 కుంటలు, 15/ఆ/3లో 23 కుంటలు, 16/అ/4లో 21 కుంటల భూమి కలదని, అట్టి తన స్వాధీనంలోనే ఉన్నదని, భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నానని పట్టాలు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యలు కొరకు కలెక్టరేట్ ఈ సెక్షన్ పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.
అన్నపురెడ్డిపల్లి మండలం, గ్రామానికి చెందిన యం నాగేశ్వరావు అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని అంకమ్మతల్లి దేవాలయం దగ్గర ఉన్న సిపిఎస్ పాఠశాల భవనం మరమ్మత్తు పనులను మనవూరు – మనబడి క్రింద చేపట్టారని, అలాగే సిసి రోడ్లు నాసిరకంగా వేశారని, అధికారులు పర్యవేక్షణ చేయకుండా పనులు చేపట్టడం జరిగిందని, వివరాలు కావాలని సమాచారహక్కు చట్టం ద్వారా అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారని, విచారణ నిర్వహించి నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టరుపై తగు చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ పంచాయతీరాజ్ ఈఈకి ఎండార్స్ చేశారు.
మణుగూరు మండలం, విజయనగరం (తిరాపురం) గ్రామానికి చెందిన మునిగల శివాజి బిటిపిఎస్ రైల్వేలైను నిర్మాణంలో ఇల్లు కోల్పోయామని, విచారణ సమయంలో గుండె సంబంధిత వ్యాధితో బాదపడుతూ ఖమ్మం మమత హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నానని, రైల్వే లైను నిర్మాణంలో నిరాశ్రులైన వారికి మంజూరు చేసిన విధంగా తనకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని చేసిన పిర్యాదును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యలు కొరకు కలెక్టరేట్లోని భూ సేకరణ విభాగం పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.
పాల్వంచ మండలం గాంధీనగర్, మంచికంటినగర్ కు చెందిన ధరావత్ శివక్రిష్ణ, గడిదేశి రాజు గాడిపల్లి కళ్యాణ్కుమార్ తామంతా సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారమని, దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామని, వ్యవసాయాన్ని జీవనోపాధిగా మార్చుకోవడానికి కావలసినటువంటి భూమి తమకు లేదని లీజుకు తీసుకుందామని ప్రయత్నం చేసినా లభించడం లేదని, ప్రభుత్వ పరిధిలో వ్యవసాయానికి ఉపయోగపడకుండా ఉన్న భూమి 4 లేదా 5 ఎకరాలు తమకు లీజుకు కేటాయించాలని, అట్టి భూమిలో సేంద్రీయ పద్దతిలో కూరగాయల సాగు చేస్తామని చేసిన దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యలు కొరకు కలెక్టరేట్లోని ఈ సెక్షన్ పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మండలం, కూలీలైన్కు చెందిన కె.సతీష్ కుమార్ రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డిఆర్ కు ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.